1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (09:06 IST)

ఫోర్జరీ కేసులో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న అరెస్టు

ayyannapatrudu
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేసారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ అయ్యన్నపాత్రుడిపై అభియోగాలు మోపారు. ఈ కేసులో గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అలాగే, ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల అయన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను ఏలూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. 
 
మరోవైపు, అయ్యన్నపాత్రుడు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ఒక ముఖ్యమంత్రిగా కాకుడా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు బద్ధలు కొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.