1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 1 ఏప్రియల్ 2021 (17:38 IST)

ఉప ఎన్నికలతో జగన్‌కు టెన్షన్, ఆ నేతలంతా తిరుపతిలోనే...

తిరుపతి ఉప ఎన్నికలపై అధికార వైసిపిలో అప్పుడే గుబులు మొదలైంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే ఉప ఎన్నికపై ఆలోచనలో పడ్డారు. ఒకే ఒక్క ఎంపి సీటు కోసం ఏకంగా బిజెపి అధిష్టానమే రంగంలోకి దిగడం.. కేంద్రమంత్రులను, బిజెపి ముఖ్య నేతలందరినీ ప్రచారానికి పంపిస్తుండటంతో వైసిపి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
 
15 రోజులకు 20 మందికిపైగా బిజెపి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3వ తేదీ నుంచి బిజెపి అభ్యర్థి రత్నప్రభకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తుంటే ఆ తరువాత నుంచి బిజెపి నేతలందరూ క్యూ కడుతున్నారు ప్రచారం కోసం.
 
ఎలాగైనా తిరుపతి ఎంపి సీటును గెలుచుకోవాలన్న ప్రయత్నం బిజెపి-జనసేన నేతల్లో కనిపిస్తోంది. రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా ప్రజల్లోకి వెళుతూ తిరుపతిలో బిజెపి చేసిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అయితే బిజెపి అంటేనే వైసిపి నేతలకు వణుకని.. అందుకే ఆ పార్టీ నేతలపైనా ఎక్కడా విమర్సలు చేయకుండా ప్రచారాన్ని వైసిపి నేతలు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డిని రంగంలోకి దింపి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. తెర వెనుక నుంచి మొత్తం నడిపిస్తున్నారట జగన్. దీంతో తిరుపతి ఎంపి సీటు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.