శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (21:57 IST)

సీఎం జగన్ దయతోనే చంద్రబాబు - లోకేష్‌లు తిరుగుతున్నారు... మంత్రి కొడాలి నాని

ఏపీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న కొడాలి నాని మరోమారు నోరుపారేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
సోషల్ మీడియాలో జగన్‌పై పిచ్చి వాగుడులు వాగితే అంతు చూస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి దయతోనే చంద్రబాబు, లోకేశ్  హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు నాయుడు తమను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. 
 
చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరమన్నారు. 
 
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మాడు పగిలితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వాత పెట్టారని కొడాలి నాని విమర్శించారు. కంకిపాడు రహదారి నిర్మాణ పనులకు మంత్రి కొడాలి నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి శంకుస్థాపన చేశారు. 
 
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయి, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చంద్రబాబే ఆ విధంగా వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. 
 
గతంలో ఏపీలో ఒక ఎకరం పొలం అమ్మితే తెలంగాణాలో మూడు ఎకరాల పొలం కొనుక్కునేవారు. అలాగే, తెలంగాణాలో మూడు ఎకరాలు అమ్మితేగానీ, ఏపీలో ఒక్క ఎకరం భూమి వచ్చేదికాదని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
 
వీటిపైనా ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీలో ఎకరం భూమి విలువ రూ.10 లక్షలకు పడిపోయిందని, అందుకు కూడా చంద్రబాబు గత విధానాలే కారణమని, ఆయన పార్టీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారని సెటైర్లు వేశారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ.3.60 లక్షల కోట్ల అప్పులను తీసుకుని రాలేదా? అని ప్రశ్నించిన ఆయన, త్వరలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించనుందని జోస్యం చెప్పారు.
 
అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని, ఆయన సీఎంగా ఉన్న వేళ, కేసీఆర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునివుంటే, ఆయన పార్టీని పెట్టేవారు కాదని, విభజన కూడా జరిగి ఉండేది కాదన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం భూమిని అమ్మితే, ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబే కారణమని కొడాలి నాని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాకుండా చేయాలన్నది బాబు కుట్రగా ఉందని ఆరోపించారు.