శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:03 IST)

కనీస వేతనం రూ.25 వేలు... అర్చకుల డిమాండ్

అర్చకుల సంక్షేమం కోసం సుప్రీం కోర్ట్ ఇచ్చిన సూచనలను యధాతథంగా అమలు చేయాలని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఆంధ్ర రాష్ట్ర ఆది శైవ అర్చక సంఘం సభ్యులు విన్నవించారు. గురువారం వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని దేవదాయశాఖ మంత్రి కార్యాలయంలో అర్చకుల సంఘం బృందం మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. 
 
అర్చక సంక్షేమ నిధికి 500 కోట్ల డిపాజిట్లు చేర్చాలని, అర్చకులు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, అర్చకులకు కనీస వేతనం 25 వేల రూపాయలుగా నిర్ణయించి అందజేయాలని, రాష్ట్రములో నిత్యార్చన కూడా నోచుకోని 1604 దేవాలయాలను టిటిడి నిర్వాహణలో తీసుకోవాలని కోరారు. 
 
దేవదాయ ధర్మదాయ సవరణ చట్టం 33/2007 అనుగుణముగా అర్చక సర్వీస్  రూల్స్ ను తయారు చేయించి విడుదల చేయాలని, ఆంగ్ల విద్యను అభ్యసించిన అర్చకుల అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు ఇవ్వాలని, రాష్ట్రంలో పొద్దుటూరు సింహాచలం తిరుపతిలోనే ఉన్న ఆగమ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అర్చకుల భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాలని, సుప్రీంకోర్టు వారి సూచన మేరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో విన్నవించారు. 
 
వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అర్చకులకు ఇల్లు మరియు అర్చకుల జీతం పెంచడంపై అర్చకుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ  దేవదాయ శాఖ మంత్రిని ఘనంగా సన్మానించారు. 
 
కార్యక్రమంలో అర్చకుల సంఘం అధ్యక్షులు యనమండ్ర సీతారామ శర్మ, ప్రధాన కార్యదర్శి పత్రి అనిల్ కుమార్, కోశాధికారి మురికిపూడి కృష్ణ కిషోర్ మరియు 13 జిల్లాల అర్చక సంఘం నాయకులు పాల్గొన్నారు.