గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (10:04 IST)

ఏపీలో కరోనా వైరస్ లేదు.. దేశీ ప్రయాణికులపై నిరంతర నిఘా

రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా(కొవిడ్19) కేసు కూడా నమోదు కాలేదని, నిఘా, నియంత్రణా చర్యల్ని మరింత బలోపేతం చేశామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

కొవిడ్19 బాధిత దేశాల నుండి రాష్ట్రానికి  ఇప్పటి వరకు 130  మంది ప్రయాణికులు రాగా, వారిలో 125 మంది తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, మరో ఐదుగురికి 28 రోజుల పర్యవేక్షణ పూర్తయ్యిందని  తెలిపారు.

ఆరుగురి శాంపిళ్లను నిర్ధారణ కోసం పంపించగా నెగటివ్ అని తేలిందన్నారు.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యల్ని చేపట్టామని  తెలిపారు.  ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రభుత్వం జారీ చేసే ఆరోగ్య సలహాల్ని తప్పకుండా పాటించాలని, ఏమాత్రం అశ్రద్ధ చెయ్యొద్దని సూచించారు.

రాష్ట్రంలో  పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కొవిడ్19 సమాచారం తెలిసిన రోజునుంచే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యిందని, పూర్తి స్థాయిలో ముందస్తు చర్యల్ని చేపట్టామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు , రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు.

ప్రభుత్వ జనరల్  ఆసుపత్రులు, జిల్లా  ఆసుపత్రుల్లో  ఐసోలేషన్ వార్డులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, బయటికి రావొద్దని సూచించారు.

కుటుంబ సభ్యులు, ఇతరులకు దూరంగా ఉండాలని,  దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్ ల కోసం  సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, 24 గంటలూ అందుబాటులో ఉంటే స్టేట్ కంట్రోల్ సెంటర్(0866 2410978) నంబరుకు , 1100, 1902 టోల్ ఫ్రీ నంబర్లకు  ఫోన్ చేయాలని తెలిపారు.

సోషల్ మీడియాలో గానీ, మరే  ఇతర మాధ్యమాల ద్వారా గానీ ప్రచారమయ్యే  వదంతుల్ని నమ్మొద్దని సూచించారు.