1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 జులై 2020 (20:53 IST)

మూడు రాజధానులు అంశంపై సుజనా చౌదరి కోర్టుకు వెళ్తున్నారా??

బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌన్సిల్ ఆమోదించకుండా మూడు రాజధానుల బిల్లును ఏపి ప్రభుత్వం గవర్నర్‌కి పంపడమే రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
 
రాజధాని బిల్లుపై నిర్ణయం తీలుసుకునే అధికారం గవర్నర్‌కి లేదని, ఇదే అంశంపై
 సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయనున్నట్టు సమాచారం. రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల కమిషన్ పైన ఏపీ ప్రభుత్వం అనవసరంగా సమయం వృధా చేస్తుందని, కోర్టులు మొట్టికాయలు వేయటం ప్రభుత్వానికి నామోషీ అని అన్నారు.
 
పోలవరం... కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే... అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. రాజధాని విభజన బిల్లుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యా వైద్యం రాష్ట్రాల పరిధిలో అంశాలు  అయినా... విధాన పరమైన నిర్ణయం కేంద్రం తీసుకుంటుందన్నారు.

కేంద్రం పరిధిలోనే రాజధాని ఏర్పాటు అంశం ఉందన్న ఆయన గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకునే చర్యలు తీసుకుంటారని, ప్రజల శ్రేయస్సు వదిలేసి... అనవసర అంశాలపై ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని అన్నారు.