సోమవారం, 23 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:58 IST)

దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం.. సీఎంకు తితిదే ఈవో నివేదిక

laddu
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో శ్రీవారి లడ్డూను తయారు చేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఈ లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా మహా విస్ఫోటనంలా తయారైంది. తిరుమలను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
 
 ఈ నేపథ్యంలో లడ్డూ అంశంపై తితిదే ఈవో శ్యామలరావు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఓ నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆదివారం తితిదే అధికారులు అందజేయనున్నారు. ఈవో అందించిన నివేదికపై శనివారం మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. 
 
ఈ సందర్భంగా ఈవో శ్యామల రావు మాట్లాడుతూ, ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారుల, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల తదనంతరం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని చెప్పారు.