మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (10:21 IST)

తిరుమల కొండపై ఒక్క ఇడ్లీ రూ.7.50 - ఫుల్ మీల్స్ రూ.31 మాత్రమే

కలియుగదైవం శ్రీనివాసుడు కొలువైవున్న తిరుమల గిరుల్లో వ్యాపారులదే ఇష్టారాజ్యం. వారు నిర్ణయించిన రేట్లకే అన్ని రకాల ఆహార పదార్థాలను విక్రయిస్తారు. దీంతో సామాన్య భక్తుడు బయట హోటల్స్, రెస్టారెంట్లలో కడుపు నింపుకోవాలంటే జేబుకు చిల్లుపెట్టుకోవాల్సిందే. ఈ ధరలపై తితిదే అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 
 
ఈ క్రమంలో రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తితిదే బోర్డుకు కొత్త ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈయన తితిదే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 
 
ఇందులోభాగంగా, తిరుమల కొండపై భక్తులను ఎడాపెడా దోచుకుంటున్న హోటళ్లపై దేవాదాయ శాఖ దృష్టి సారించింది. కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది. దేవాదాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.