శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (09:52 IST)

చిరిగిన పట్టుచీర.. ఆర్టీసీకి అపరాధం.. ఎందుకని?

ఓ మహిళ కట్టుకున్న పట్టుచీర చిరిగితే ఆర్టీసీ సంస్థకు అపరాధం విధించారు. పట్టుచీర చిరగడానికి.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థకి సంబంధమేంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనాన్ని చదవండి. 
 
నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన నరసింహా రావు, వాణిశ్రీ అనే దంపతులు హైదరాబాద్‌లో ఉండే తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 2018 ఆగస్టు 26వ తేదీన నల్గొండ డిపోలో సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్నారు. 
 
ఈ దంపతులు అనుకున్న సమయానికి బస్టాండుకు వచ్చి... బస్సు ఎక్కుతుండగా, బస్సు డోర్ దగ్గర పైకిలేచివున్న రేకు తగిలి వాణిశ్రీ కట్టుకున్న పట్టుచీర చిరిగిపోయింది. ఆ తర్వాత ఎక్కిన మరో మహిళ చీర కూడా చిరిగిపోయింది. 
 
దీంతో ఆ రేకును సరిచేయాలని డ్రైవర్‌, కండర్లకు చెప్పగా, అది డిపో సిబ్బంది పని అంటూ దురుసుగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో వాణిశ్రీ దంపతులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. టికెట్, బస్సు, బయటకు తేలిన రేకు, చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం.. ఆర్టీసీ లోపాలను నిర్ధారించి… పట్టుచీరకు 2 వేలు, ఇతర ఖర్చులకు మరో వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.