1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (15:23 IST)

రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేస్తాం : మంత్రి విడదల రజినీ

vidadala rajini
ఉమ్మిడ గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో శుక్రవారంరాత్రి పొట్టకూటి కోసం వలస కూలీగా వచ్చిన ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్టేషన్‌లో ఉండే సిమెంట్ బల్లలపై పడుకునివున్న భర్తను చితకబాది ఆ మహిళను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లాలో జరిగిన మూడో ఘటన ఇది. దీనిపై ఏపీ వైద్య శాఖామంత్రి విడదల రజనీ స్పందించారు. 
 
ఈ అత్యాచార ఘటన జరగడం బాధాకరమన్నారు. సీఎం జగన్ దీనిపై స్పందించారని, నిందితులకు శిక్ష పడే దాకా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ, అధికారులతో మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 
 
బాధితురాలి ఆరోగ్యం గురించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, రేపల్లె రైల్వే స్టేషన్‌ను మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. 
 
ఇలాంటి ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని మూకలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం జగన్ తనను ఆదేశించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.