మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (15:50 IST)

ప్రత్యేక హోదాపై చర్చకు విజయసాయి నోటీసు

విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు నోటీసు ఇచ్చారు. 
 
సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద ఆయన ఈ నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్‌ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని నోటీసులో ఆయన కోరారు. 
 
"రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలను ప్రకటించారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అతి ప్రధానమైనది. 2014, మార్చి 1న కేంద్ర మంత్రి మండలి ఈ ప్రత్యేక హోదా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 
 
ఇప్పటికీ కేంద్ర మంత్రి మండలి ఈ హామీని నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్‌ చేసి సభలో తక్షణమే ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి" అని విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులో విజ్ఞప్తి చేశారు.