గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:08 IST)

శివమెత్తిన విరాట్ కోహ్లీ... 40వ సెంచరీ : ఆస్ట్రేలియా టార్గెట్ 251

ఐదు వన్డేల్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 251 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో వీరవిహారం చేశారు. తన వన్డే కెరీర్‌లో 40వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఏడో సెంచరీ. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డుకు మరో 9 సెంచరీల దూరంలో ఉన్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు తొలి ఓవర్ చివరి బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. అప్పటినుంచి ప్రారంభమైన వికెట్ల పతనం చివరివరకు కొనసాగింది. అయితే, కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్‌లో ఓవైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. 
 
విజయ్ శంకర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించగా, జ‌డేజాతో క‌లిసి ఏడో వికెట్‌కు 67 ప‌రుగులు జోడించాడు. దీంతో టీమిండియా 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీకాకుండా విజయ్ శంకర్ ఒక్కడే 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ధావన్, జడేజా చెరొక 21 పరుగులు చేశారు. రోహిత్ (0), ధోనీ (0), జాదవ్ (18), రాయుడు (11) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 120 బంతులు ఆడి 116 పరుగులు చేశాడు.