1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (10:55 IST)

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చంధంగా మూతపడుతున్న థియేటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని థియేటర్లపై ఏపీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. అలాగే, అపరిశుభ్రంగా, నిబంధనలు పాటించడం లేదన్న సాకులతో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే చిత్తూరు జిల్లాలో థియేటర్లపై అధికారులు కొరఢా ఝుళిపించారు. ఈ జిల్లాలో 11 థియేటర్లను మూసివేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 37 సినిమా హాళ్ళకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 థియేటర్లను గురువారం మూసివేశారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4 చొప్పున థియేటర్లు మూసివేశారు. 
 
ఈ పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో పలు సినిమా థియేటర్లను యజమానులు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. పెనుకొండలో మూడు, గోరంట్లలో ఓ థియేటర్‌ను యజమానులు మూసివేశారు. అలాగే, ఇతర ప్రాంతాల్లోనూ పలు థియేటర్లను మూసివేసే దిశగా యజమానులు సిద్ధమవుతున్నారు.