శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:15 IST)

ఏపీలో ఏం జరుగుతోంది?... రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై వెంటనే పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను కోరింది. 
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబునాయుడు సర్కార్ అనేక అవకతవకలకు పాల్పడిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా చేస్తామని ప్రకటించారు. ప్రకటించినట్టుగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది జగన్ సర్కార్. 
 
రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని సూచించినా కూడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కేంద్రం సీరియస్  అయినట్టుగా తెలుస్తోంది.తమ సూచనను పట్టించుకోకుండా 24 గంటల్లోపుగానే రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్ కె జైన్ ను కోరింది.
 
పీపీఏ సమావేశం వివరాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసు లేఖను సీఈఓ ఆర్ కే జైన్ కేంద్ర జలమంత్రిత్వశాఖకు పంపారు. అయితే తమ సూచనలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. 
 
ఈ విషయమై సోమవారం నాడు (ఈ నెల 19వతేదీ) కేంద్ర జలమంత్రిత్వశాఖ అధికారులు పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ తో మాట్లాడారు. కేంద్ర జలమంత్రిత్వశాఖ అధికారులు పోలవరం పనులకు రివర్స్ టెండర్లను ఆహ్వానించడంపై మాట్లాడినట్టుగా పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ మీడియాకు వివరించారు.రెండు రోజుల్లో ఈ విషయమై కేంద్రానికి నివేదిక అందించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిద్దంగా ఉన్నట్టుగా సీఈఓ ఆర్ కె జైన్ ప్రకటించారు.
 
రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత పెరిగే అవకాశం ఉందని పీపీఏ సూచించింది. అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణం కూడ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడ పీపీఏ అభిప్రాయపడింది. 
 
ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న నవయుగ కంపెనీ పనితీరు పట్ల పీపీఏ సంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ నెల 13వ తేదీన పీపీఏ హైద్రాబాద్ లో సమావేశమైంది. ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయకూడదని కూడ ఆ సమావేశంలో తీర్మానం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని పీపీఏ సీఈఓ ఆర్ కె జైన్ ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాత్ దాస్ కు నాలుగు రోజుల క్రితం లేఖ రాశారు.

ఇటీవల జరిగిన పీపీఏ సమావేశం మినిట్స్ ను కూడ ఈ లేఖకు జత చేశారు.పీపీఏ సీఈఓ సూచనలను బేఖాతరు చేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండర్లకు ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.