శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (08:34 IST)

మాట‌లక‌న్నా ఛాయాచిత్రం సందేశం మిన్న..తమ్మినేని

వ‌ంద మాట‌ల కంటే ఒక ఛాయా చిత్రం ఇచ్చే సందేశం స‌మాజాన్ని పెద్ద ఎత్తున ప్ర‌భావితం చేయ‌గ‌లుగుతుంద‌ని, ఛాయాచిత్రంతో మన సాంస్కృతిక సాంప్రదాయాలకు సజీవ రూపం ఇస్తున్న ఫోటోగ్రాఫర్ లను అభినందించి ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఫోటొ అకాడమీ ఆధ్వరంలో విజయవాడ మొగల్రాజపురంలోని కల్చరల్ సెంటర్ నందు ఆదివారం నిర్వహించిన ఫోటోగ్రఫీ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది పదాల్లో చెప్పలేని భావాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసేది ఫోటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రమేనని అన్నారు. వర్ధమాన విశేషాలను భవిష్యత్ తరాలకు అందించే ఏకైక సాధనం ఫోటోగ్రఫీ అన్నారు. చరిత్రను దృశ్యరూపంలో నిక్షిప్తం చేసి జ్ఞాపకాల చిరస్థాయిగా నిలిపే ఛాయాచిత్రాలను చిత్రీకరించే ఫోటోగ్రాఫర్ లను వారి నైపుణ్యాన్ని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.

మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడకుండా భావితరాల వారికి తెలియచెప్పే ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేసి యువతకు చాటి చెప్పటం అభినందనీయమన్నారు. అనేక సంఘటనలలో ఛాయా చిత్రాన్ని సాక్షిగా ఉదహరించిన సంఘటనలు ఉన్నాయని, వాటిని చిత్రీకరించడానికి ఫోటోగ్రాఫర్లు ఎన్నో సాహసాలను చేయవలసి వస్తుందన్నారు.

ఎన్నో వేయ ప్రయాసలకోర్చి ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్ లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పత్రికా రంగనికి ఫోటోలు అందించే ఫోటోగ్రాఫర్లు ఆ వార్తకు సంబంధించి సందేశాన్ని ఫోటోగ్రఫీలోనే అందించగలరన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ అనేది సృజనాత్మక కళ అని అన్నారు. ఈ రంగంలో కూడా ఎంతో సాంకేతికత పెరిగిందని అందరినీ ఆశ్చర్యపరిచే ఛాయాచిత్రాలు వస్తున్నాయన్నారు. మనిషి హృదయాలను కదిలించే శక్తి ఫోటోలోనే ఉందన్నారు.

ఎన్నో ప్రకృతి దృశ్యాలను మనం అక్కడికి వెళ్లి చూడలేమని వాటిని మన కళ్ళకు కట్టినట్లుగా ఫోటోల రూపంలో చోటు కలుగుతుందన్నారు. ప్రతి ఫోటోలో ఒక సందేశం ఉంటుందని వాటిని ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫోటోగ్రఫీ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఫోటోగ్రఫీ రంగం 110 రంగాల్లో ఇమీడి ఉందన్నారు. ఫోటోగ్రఫీ రంగంలోని నిపుణులు తయారుచేసి మరింత సృజనాత్మకమైన ఫోటోలను సమాజానికి అందించాలని దృక్పధంతో ఫోటోగ్రాఫర్ లను ప్రోత్సహిస్తున్నారు అని తెలిపారు.

కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఫోటోగ్రఫీ అకాడమీ 52వ వార్షికోత్సవ సంచికను మరియు ఉత్తమ ఫోటోలుగా ఎన్నికైన ఛాయా చిత్రాలతో కూడిన సావనీరును శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. ఏపీ ఎస్ సిసి ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మికుమారి, అకాడమీ చెందిన నైనిటాల్ తదితరులు పాల్గొన్నారు.