1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

'యానాం' ఏపీలో విలీనం కానుందా?

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో భాగమైన యానాం పట్టణాన్ని, పరిసర ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనిపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయాని కొచ్చేసింది. దీనివెనుక రాజకీయ కారణాల్తో పాటు సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

యానాం పట్టణం పుదుచ్చేరి రాష్ట్రంలోని ఒక అసెంబ్లి నియోజక వర్గం. అయితే పుదుచ్ఛేరి తమిళనాడును ఆనుకునుంటుంది. కానీ యానాం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి పక్కనే సముద్రతీరాన ఉంది. యానాం అధికార కేంద్రం పుదుచ్ఛేరిలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలకు మధ్య దూరం 700 కిలోమీటర్లకు పైబడే. ప్రభుత్వ నిర్ణయాలన్నీ పుదు చ్చేరిలోనే జరుగుతాయి.

అధికారుల బదలీల్నుంచి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వరకు అక్కడి ఆదేశాలకనుగుణంగానే యానాంలో అమలౌతాయి. యానాం ప్రజలు చిన్న బెయిల్‌ కావాలన్నా పుదుచ్ఛేరిలోకి పరుగులుదీయాల్సిందే. ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు, మోతుబరి దృవీకరణ పత్రాల జారీక్కూడా అక్కడికెళ్ళాల్సిందే.

దీర్ఘకాలంగా యానాం పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలంటూ యానాం ప్రాంత రాజకీయ నాయకులు, కొన్ని వర్గాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పాలకపార్టీలు మాత్రం ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చాయి. పుదుచ్ఛేరిలో భాగంగానే కొనసాగుతామంటూ ఉద్యమాలు కూడా నిర్వహించాయి. 


యానాంలో రాజకీయాలు గత కొన్ని దశాబ్ధాలుగా ఏకపక్షంగా నడుస్తున్నాయి. పుదుచ్ఛేరి రాష్ట్రంలో ఒకే ఒక పార్లమెంట్‌ స్థానం ఉంది. ఈ రాష్ట్ర పరిధిలో మొత్తం 30అసెంబ్లి స్థానాలు ఈ పార్లమెంట్‌ ప రిధిలోకొస్తాయి. మిగిలిన 29అసెంబ్లి స్థానాల్లోని ఓటర్లకంటే యానాంలో ఓటర్ల సంఖ్య ఎక్కువ.

గతకొన్ని ఎన్నికలుగా యానాం ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టంగడుతున్నారు. అది కూడా భారీ మెజార్టీ ఇస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎమ్‌పి అభ్యర్ధికొచ్చిన ఓట్లు పుదుచ్ఛేరి పార్లమెంట్‌ స్థానం విజయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మిగిలిన 29నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు మెజార్టీ సాధించినా ఒక్క యానాంలో కాంగ్రెస్‌ సాధిస్తున్న మెజార్టీతో పుదుచ్ఛేరి ఎమ్‌పి స్థానం ఫలితం తారుమారౌతోంది. అది కాంగ్రెస్‌ ఖాతాలో పడుతోంది.

దక్షిణాదిన పట్టుబిగించే యోచనలో ఉన్న బిజెపి కర్ణాటక తర్వాత తన దృష్టిని పుదుచ్ఛేరిపై పెట్టింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ముఖ్యమంత్రితో సమాన స్థాయి కలిగిన ఎమ్‌పి స్థానం నుంచి విజయం సాధించాలన్నా యానాం అసెంబ్లి అడ్డుగా ఉందన్న విషయాన్ని బిజెపి గుర్తించింది.

దీంతో యానాం అసెంబ్లిని పుదుచ్ఛేరి నుంచి విడదీసి ఆంధ్రాలో విలీనం చేస్తే తప్ప తమ ఆకాంక్ష నెరవేరదన్న నిర్ణయానికొచ్చేసింది. ఇదే సమయంలో ఎపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. జగన్‌ తన ఎన్నికల ప్రచారంలోనే సంపూర్ణ మద్య నిషేదంపై స్పష్టమైన హామీనిచ్చారు.

అధికారంలోకొచ్చాక విడతల వారీగా మద్యనియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మొత్తం దుకాణాల్లో 20శాతాన్ని తగ్గించారు. మద్యం వ్యాపారాన్నిప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. స్పష్టమైన సమయపాలన నిర్దేశించారు. అయితే తూర్పుగోదావరిని ఆనుకునున్న యానాం పట్టణం నుంచి జిల్లా మీదుగా రాష్ట్ర వ్యాప్తం గా పెద్దెత్తున మద్యం తరలిపోతోంది.

ఏటా 20శాతం చొప్పున దుకాణాల్ని తగ్గించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యానాం ఒక అతిపెద్ద అడ్డంకిగా మారింది. ఎన్‌ టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సంపూర్ణ మద్య నిషేదం అమలైంది. కానీ పుదుచ్ఛేరి నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి మీదుగా యానాం వచ్చే మద్యం లారీలు మార్గమద్యంలోనే అన్‌లోడ్‌ అయ్యేవి.

ఎక్కడికక్కడ యానాం మద్యం విచ్చలవిడిగా అమ్ముడయ్యేది. ఇది కూడా సంపూర్ణ మద్య నిషేదం విఫలమవడానికి కారణ మైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్‌ ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. యానాం మద్యం ఉండగా ఎపిలో మద్య నియంత్రణ లేదా నిషేదం అమలు సాధ్యం కాదని కేంద్రం దష్టికి తెచ్చారు.

స్వతంత్ర హోదా కలిగిన పుదుచ్ఛేరిలో భాగమైనా యానాంలో మద్యం అమ్మకాల్ని నిషేదించే అధికారం ఎపికిలేదు. దీంతో మొత్తం యానాంనే తన పరిధిలో విలీనం చేస్తే సమస్య పరిష్కారమౌతుందని జగన్‌ కేంద్ర హోమ్‌శాఖకు సూచించారు.

రాష్ట్రాల వారీగా అమ్మకపు పన్ను విధానం అమలౌతున్న సమయంలో యానాం నుంచి పన్ను చెల్లించని పలురకాల వినిమయ వస్తువులు ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తేవి. ముఖ్యంగా డీజిల్‌, పెట్రోల్‌ పుదుచ్ఛేరి డీలర్‌ బిల్లుతో చిత్తూరు నుంచి తూర్పుగోదావరి వరకు పలుచోట్లకు దిగుమతయ్యేవి. దీంతో ఎపికి దక్కాల్సిన అమ్మకపు పన్నుకు తూట్లు పడేది. జిఎస్‌పి అమలుతో ఎపికి ఈ బెడద తప్పిన విషయాన్ని జగన్‌ వివరించారు.

 
కాగల కార్యం గాంధర్వులే తీర్చారన్న చందంగా కేంద్రం యానాంపై దృష్టి సారించింది. ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్‌ కిరణ్‌బేడి యానాంలో పర్యటించారు. స్థానిక అధికారుల్తో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన మంత్రితో పాటు ఆయన వర్గీయుల్నుంచి గవర్నర్‌కు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.

దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటికే ఆమె కేంద్రానికందించారు. దేశం మొత్తం కాంగ్రెస్‌ ఉనికి కోల్పోతున్న ఈ చిన్ని పట్టణంలో మాత్రం ఇంకా బలంగా ఉందన్న విషయాన్ని ఆమె తెలియజేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలంటే విలీనం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది.

భౌగోళికంగా యానాం అతిచిన్న పట్టణం. ఇది 31.8చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2011లెక్కల మేరకు ఇక్కడ జనాభా 55,616మంది. ఇక్కడ తెలుగుతో పాటు తమిళం, ఫ్రెంచ్‌, మాట్లాడే వ్యక్తులు అధికంగా కనిపి స్తారు. ప్రభుత్వ కార్యాలయాలపై తెలుగుతో పాటు తమిళంలోనూ బోర్డులుంటాయి.

యానాం ప్రత్యేకత :
యానాం ప్రాంతానికి పలు ప్రత్యేకతలున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇదిప్పటికీ ఫ్రెంచ్‌ జాతీయులకు దత్తపుత్రిక వంటి ప్రాంతం. యానాంకు చెందిన వందలాదిమంది ఫ్రాన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.

అలాగే ఇప్పటికీ వందలాదిమందికి ఫ్రాన్స్‌ నుంచి నెలనెలా పింఛన్‌ అందుతోంది. బొబ్బిలి కోటపై విజయనగరరాజు దండెత్తిన సమయంలో అప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తిష్టవేసిన ఫ్రెంచ్‌ జాతీయులు విజయరామరాజుకు మద్దతుగా నిల్చారు.

అప్పటి ఫ్రెంచ్‌ జనరల్‌ బుస్సీ తన సేనల్తో విజయనగర రాజు తరపున బొబ్బిలిపై దాడి చేశాడు. విజయానంతరం విజయరామరాజు కృతజ్ఞతగా తన పరిధిలోని యానాం ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ వారికిచ్చేశాడు. అయితే అప్పట్లో యానాంలో సముద్రతీరం తప్ప మరేంలేదు. దీంతో 1727లో ఫ్రెంచ్‌ జాతీయులు ఈ ప్రాంతం నుంచి తిరిగెళ్ళిపోయారు.

1742లో తిరిగి వారిక్కిడకొచ్చారు. అప్పటికి ఈ ప్రాంతంపై మొఘలులు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. వారికి రత్నాలు, వజ్రాలు మరికొన్ని బహుమతులిచ్చి అందుకు బదులుగా యీనాంగా ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ జాతీయులు పొందారు. అప్పట్నుంచి దీన్ని యీనాంగా పిలిచేవారు. రాన్రాను ఇదే యానాంగా మారింది.

ఈ యానాం ప్రెంచ్‌ అధీనంలో ఉంటే పక్కనే ఉన్ననీలపల్లి గ్రామం వరకు బ్రిటీష్‌ పాలన సాగేది. భారత్‌కు 1947లో ఆంగ్లేయుల్నుంచి స్వాతంత్రమొచ్చింది. కానీ అప్పటికింకా ఫ్రెంచ్‌ జాతీయులు భారత్‌ను వ దిలిపోలేదు. వారధీనంలోని యానాం కూడా భారత్‌లో విలీనం కాలేదు.

1954జూన్‌ 13న ఫ్రెంచ్‌ స్థావరాలపై కూడా భారత సైనికుల దాడి జరిగింది. మిగిలిన ప్రాంతాల్తో పాటు యానాంను కూడా భారత సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. ఇలా 1954నవంబర్‌ 1న ఫ్రాన్స్‌ నుంచి ఆ దేశ అధీనంలోని భారత ప్రాంతాలు ఢి ఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఇక్కడ ఫ్రెంచ్‌ పరోక్ష పెత్తనం సాగింది.

1962ఆగస్టు 16న పూర్తిగా యానాంతో పాటు ఫ్రెంచ్‌ అధీనంలోని స్థావరాలన్నీ భారత రి పబ్లిక్‌ అధీనంలోకొచ్చాయి. దాన్నే దెజూర్‌ ట్రాన్స్‌ఫర్‌గా పరిగణిస్తారు. ఇప్పటికీ ఆగస్టు 16న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పుదుచ్ఛేరితో కలిపి అంతకుముందు ఫ్రెంచ్‌ ప్రభుత్వానికిచ్చిన హామీకనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణిస్తున్నారు.

ఇటీవలె జమ్మూకాశ్మీర్‌కు ఇలాంటి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దయింది. ఇదే క్రమంలో పుదుచ్ఛేరి, కరైకల్‌, యానాం, మహే, వంటి ఒకప్పటి ఫ్రెంచ్‌ వలస ప్రాంతాలకిచ్చిన ప్రత్యేక ప్రతిపత్తులు కూడా రద్దుకానున్నాయి. అలాగే యానాంను ఎపిలో విలీనం చేయడం ద్వారా ఎపికి ఓ సమగ్ర భౌగోళిక రూపం ఏర్పడనుంది.