1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (17:14 IST)

ఇక వైన్ షాప్ ఉద్యోగుల వంతు.... సమ్మె తాత్కాలిక వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ ఉద్యోగులు త‌మ సమస్యలు పరిష్కరించాలని స‌మ్మెకు దిగుతున్నారు. పెండిగులో ఉన్నబోనస్ విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. వైన్ షాపు ఉద్యోగులు జ‌న‌వ‌రి 16న చేపట్టబోయే వైన్ షాపులు బంద్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏ ఐ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తాటిపాక మధు వెల్లడించారు.

 
వైన్ షాపు ఉద్యోగుల‌ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా జూమ్ యాప్ ద్వారా జరిగింది. 13 జిల్లాల నుండి నాయకులు హాజరయ్యారు. యూనియ‌న్ నాయ‌కుడు  రావులపల్లి రవీంద్రనాథ్ అన్నిజిల్లాల నాయకులతో వైన్ షాప్ బంద్ పై సమాలోచనలు చేశారు. 21న రాష్ట్ర క్యాబినెట్ విజయవాడలో జరుగుతున్నందున ఆనాడు మంత్రులతో చర్చించాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా కార్పొరేషన్ ఎండీతో కలిసి చర్చలు పూర్తయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం యూనియన్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రావులపల్లి తెలియజేశారు.

 
ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం కార్పొరేషన్ ఎండి సానుకూలంగా స్పందించాలని సిబ్బందిని ఇబ్బంది పెట్టి విధానం మానుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ, సమ్మెలో పాల్గొంటే తొలగిస్తామని ఎండి మెమో ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మె అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని ఎవరూ తొలగించలేరని మధు తెలిపారు. పిఆర్సి అమలు చేయమని మేం కోరడం లేదని, ఇస్తామన్న బోనస్ ఇవ్వమని, వేతనాలు పెంచమని ఈఎస్ఐ పీఎఫ్ సక్రమంగా అమలు చేయమని కోరుతున్నామ‌ని తెలిపారు. తాత్కాలిక ఉద్యోగుల‌కు అయినా కార్మిక హక్కులు, చట్టాలు ఉన్నాయన్న విషయాన్ని ఎండి గమనించాలన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ ఉద్యోగులను అప్కాస్ లో కలపాలన్నారు.