1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అతిథి గృహం నుంచి వెళ్లిపోయిన భాస్కర్ రెడ్డి

bhaskar reddy
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేయడం ఖాయంగా తెలుస్తుంది. దీంతో వైఎస్ ఫ్యామిలీలో ఉత్కంఠత నెలకొంది. వివేకా హత్య కేసులో ఈ నెల 12వ తేదీన విచారణకు రావాలని మరోమారు భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఆదివారం కడప కేంద్ర కారాగారం అతిథిగృహం వద్దకు వచ్చారు. అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్‌ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. 
 
ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ తేదీని మళ్లీ తెలియజేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని తెలిపారు. 
 
కాగా, అవినాష్‌ రెడ్డితో పాటు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరపున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాము దేనికైనా సిద్ధమని భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
భాస్కర్‌రెడ్డిని సీబీఐ యేడాది కిందట వరుసగా రెండు రోజులపాటు పులివెందులలో విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి విచారణకు పిలిచింది. మరోవైపు భాస్కర్‌రెడ్డి రాకతో కడప జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.