శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (12:56 IST)

వైకాపా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన వైఎస్.జగన్మోహన్ రెడ్డి

ys jagan
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇలాంటి హెచ్చరికలు అందుకున్న వారిలో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో రోజుకు కనీసం 2 గంటలు కూడా పాల్గొనలేదని సీఎం జగన్ సొంతంగా తయారు చేసిన నివేదికలో బహిర్గతం చేశారు. ఇందులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మొబైల్ ఫోనుకు "మా నమ్మకం నువ్వే జగన్" అంటూ ముద్రించిన స్టిక్కర్లను విధిగా అంటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  మొత్తం 1.65 కోట్ల ఇంటి తలపులకు, ఆయా ఇళ్లలోని వారి మొబైల్ ఫోన్లకు కూడా ఈ స్టిక్కర్లు అంటించాలని సూచించారు. తలపులకు పెద్ద స్టిక్కర్లు, మొబైల్ ఫోన్లకు చిన్నసైజు స్టిక్కర్లు అంటించాలని ఆదేశించారు. 
 
ఇందుకోసం సచివాలయ వైకాపా సమన్వయకర్తలు, గృహసారథులు మొత్తం 5.65 లక్షల మందితో జగనన్నే మా భవిష్యత్ పేరిట మార్చి 18 నుంచి 26వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 93 శాతం మంది అంటే 5 లక్షల మంది గృహ సారథుల నియామకం పూర్తయిందన్నారు. మిగిలినవారిని కూడా ఈ నెల 16వతేదీ లోగా నియమించాలని కోరారు. దీంతో క్షేత్రస్థాయిలో 5.65 లక్షల మందితో వైకాపా సైన్యం అందుబాటులోకి వస్తుందని, వీరితో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. 
 
ఈ ప్రచారంలో, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు.. దానికి భిన్నంగా, అంతకుమించి ఇపుడు వైకాపా ప్రభుత్వం చేసిందేంటి? వారి ఇళ్ళలో ఇచ్చిన పథకాలేంటి అనే వివరాలలతో కూడిన ప్రచార ప్రత్రాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే, జగన్ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి అని ఒక నంబరును ఇవ్వాలని సూచించారు.