YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్
వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు, దళిత నేతలు, లాయర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని, రామచంద్రారెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చూస్తున్నారని తెలిపారు. మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉందా అని జగన్ ప్రశ్నించారు. నిజంగా మహిళలపై గౌరవం ఉంటే రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే చర్యలు ఎక్కడ తీసుకున్నారని నిలదీశారు.
మహిళలకు చంద్రబాబు చేసిందేంటి అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అక్కాచెల్లెమ్మలకు అండగా ఉన్నది, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలని తపన పడ్డది తమ ప్రభుత్వమేనని జగన్ తెలిపారు. మహిళలంటే గౌరవం ఎవరికి ఉందనేది ఈ చర్యలతో తెలిసిపోతుందని చెప్పారు.