1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (12:26 IST)

జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారు.. ఆయన్నే గౌరవిస్తా : మాజీ మంత్రి బాలినేని

balineni srinivasa reddy
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, అదేసమయంలో మనం కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మించిన వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడారు. 'నాకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చింది ఒంగోలు. రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తా' అని బాలినేని స్పష్టం చేశారు.

'నాకు అయినవాళ్లు.. కాని వాళ్లంటూ ఎవరూ లేరు. కావాల్సింది కార్యకర్తలు. వారి కోసం మా నాయకుడు జగన్‌ని తప్ప ఎవరినీ లెక్క చేయను. మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి పోటీ చేస్తానంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు ఇటీవల బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అటువంటి వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనిపించింది. కార్యకర్తలు ఇప్పటికి ఐదుసార్లు గెలిపించారు. వారి రుణం తీర్చుకుంటాను' అని అన్నారు.