గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:57 IST)

రోజానా మజాకా? అంబులెన్స్ బైక్ నడిపిన ఎమ్మెల్యే

సినీ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్కే. రోజా చేసే ప్రతిపని వైరల్ అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేక పోయిన ఆమె.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ, ఆమె ప్రతి నిత్యం మీడియాతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా అంబులెన్స్ బైక్ నడిపి మరోమారు వార్తలకెక్కారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీసిటీ హీరో మోటార్‌ సంస్థ (నగరి).. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్‌ బైక్‌లను ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతులమీదుగా అందజేశారు. అనంతరం జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శ్రీసిటీ హీరో మోటార్స్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ, సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచార‌ని కొనియాడారు. 
 
ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్‌ జగన్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ ర్యాంకును కూడా టీడీపీ తమ ఘనతేనని చెప్పుకోవడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమంటూ ధ్వజమెత్తారు.