శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (19:43 IST)

ముసలి నక్క - యువ నక్కకు కడుపు మండిపోతోంది : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న వివిధ రకాల అభివృద్ధి పథకాలను చూసి ఒక ముసలి నక్క, మరో యువ నక్కకు కడుపు మండిపోతోందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖపట్టణం జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే సుపరిపాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. 
 
రాష్ట్రంలో ఇన్ని మార్పులు వస్తుంటే, ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఓ ముసలి నక్కకు, ఓ యువ నక్కకు కడుపు మండిపోతోందని ఆరోపించారు. ఆ నక్కలు ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ప్రజలందరికీ తెలుసని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, 2014లో ముఖ్యమంత్రిగా వచ్చిన ఆ ముసలి నక్క తన హయాంలో సాధించలేనిది ఈ ఐదు నెలల్లోనే జగన్ సాధించడంతో ఓర్వలేకపోతున్నాడని, కడుపుమంటతో విలవిల్లాడిపోతున్నారంటూ మండిపడ్డారు. ఆ ముసలి నక్క రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదని, యువ నక్క సమర్థ నాయకత్వం అందిస్తాడని ప్రజల్లో నమ్మకం లేదని జోస్యం చెప్పారు. 
 
తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు గొంతు పిసికి చంపేస్తున్న విషయం అందరికీ తెలుసని, మామ పెట్టిన పార్టీని వెన్నుపోటుతో హస్తగతం చేసుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు స్వంత ప్రయోజనాల కోసం టీడీపీనే ఫణంగా పెట్టి మరో పంచన చేరేందుకు పన్నాగాలు పన్నుతున్న దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు. 
 
ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా వెలుగొందిన చంద్రబాబు ఇవాళ జాతి నాయకుడిగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. సుజనా, సీఎం రమేశ్ తదితరులను చంద్రబాబే పంపిస్తున్నారని, అభద్రతా భావంతో వారిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి పంపించారన్నారు.