మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (14:06 IST)

చంద్రయాన్-2‌పై పాకిస్తాన్ అక్కసు.. ‘అభినందన్‌ ఇడియట్’ అంటూ పాక్ మంత్రి ట్వీట్లు

చంద్రయాన్-2 ప్రయోగాన్ని భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మిషన్‌లో భాగంగా 47 రోజులపాటు ప్రయాణించిన వ్యోమనౌక శుక్రవారం చంద్రుడి ఉపరితలం సమీపానికి చేరుకుంది. మరో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఉపరితలంపై దిగుతుందన్న సమయంలో చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. అంతా సవ్యంగానే ఉందని మొదట ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. అయితే మరో 2.1 కి.మీ. దూరం ఉండగా ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఆయన స్పష్టం చేశారు.

 
ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడిపై తమ వ్యోమనౌకలను చంద్రుడిపై ల్యాండింగ్ చేయగలిగాయి. భారత్ ఈ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్వయంగా బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి శుక్రవారం వెళ్లారు. ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన వెంటనే శాస్త్రవేత్తలకు మోదీ ధైర్య వచనాలు చెప్పారు. ఏ ప్రయోగంలో అయినా ఎత్తుపల్లాలు ఉంటాయంటూ వారి వెన్నుతట్టారు.

 
ఈ ప్రయోగాన్ని యావద్భారతావని ఎంతో ఆసక్తిగా తిలకించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ప్రజలు ఏం జరుగుతుందోనని టీవీలకు అతుక్కుపోయారు. ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలియగానే కొందరు నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే అందరూ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి మాత్రం వ్యంగ్యాస్త్రాలు, పరుష వ్యాఖ్యలు వచ్చాయి.

 
తొలుత పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌధరి స్పందించారు. చంద్రయాన్-2 ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంపై ట్విటర్‌లో మోదీ స్పందనను ఆయన రీ-ట్వీట్ చేశారు. ''ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలపై మోదీజీ ప్రసంగం ఇస్తున్నారు. ఆయన నాయకుడు కాదు ఓ వ్యోమగామి. పేద దేశానికి చెందిన రూ.900 కోట్లను వృథా చేసినందుకు లోక్‌సభ ఆయన్ను నిలదీయాలి''అని ఫవాద్ వ్యాఖ్యలు చేశారు.

 
''భారతీయులు చేస్తున్న ట్రోల్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. చంద్రయాన్-2 ఏదో నా వల్ల విఫలమైనట్లు నన్ను తిడుతున్నారు. రూ.900 కోట్లను వృథా చేయమని మేం ఏమైనా చెప్పామా? ప్రశాంతంగా ఉండండి. వెళ్లి నిద్ర పోవడానికి ప్రయత్నించండి''అని ఆయన మరో వ్యాఖ్య కూడా చేశారు. అంతేకాదు దీనికి ఇండియా ఫెయిల్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను తగిలించారు.

 
కంట్రోల్ రూమ్‌ నుంచి మోదీ వెళ్లిపోవడాన్ని చూశారా అని ఓ పాకిస్తానీ ప్రశ్నించగా.. ''అయ్యో.. చూడలేకపోయానే''అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అభయ్ కశ్యప్ అనే భారతీయుడి ట్వీట్‌పై ఫవాద్ స్పందిస్తూ.. '' పడుకో సోదరా.. చంద్రుడికి బదులు ముంబయిలో ఓ బొమ్మ కొనిస్తా''అని ట్వీట్‌చేశారు. ఇండియాను ఎండియాగాను సంబోధించారు.

 
ఫవాద్ వ్యాఖ్యలపై భారత టీవీ జర్నలిస్టు ఆదిత్య రాజ్ కౌల్ ఘాటుగా స్పందించారు. ''ఈయనతో పాకిస్థాన్‌కు కూడా ఒరిగే మంచేమీ లేదు. సమాచార శాఖ నుంచి గెంటేసినట్టే.. శాస్త్ర, సాంకేతిక శాఖ నుంచీ ఈయన్ను తీసేయండి. సూర్య, చంద్రులు ఎప్పుడొచ్చారు? ఎప్పుడెళ్లారు? అని నోట్ చేసుకోవడమే వీరి పని. నువ్వు చదువుకున్నది ఇదేనా. మతి చెడినట్టు ఉంది''అని వ్యాఖ్యానించారు.

 
మరోవైపు పాకిస్తాన్‌లో ఇండియా ఫెయిల్డ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. చంద్రయాన్-2 విఫలమైందని రెచ్చగొడుతూ పలువురు వ్యాఖ్యలూ చేశారు. అదే సమయంలో పలువురు పాకిస్తానీలు కూడా భారత్ చంద్రయాన్-2ని సమర్థిస్తూ పాక్ మంత్రినే విమర్శించారు. కనీసం భారత్ ప్రయత్నించింది.. మనం కనీసం ప్లాన్ కూడా చేయడం లేదు కదా అంటూ మంత్రి ఫవాద్ హుస్సేన్‌కు చీవాట్లు పెట్టారు.

 
తమ దేశ సైన్స్, టెక్నాలజీ మంత్రి పోటీపడలేక ఇలా మాట్లాడుతున్నారని.. నిజానికి భారత్ చేపట్టిన చంద్రయాన్ విజయవంతం కాలేకపోయినంత మాత్రాన దాన్ని వైఫల్యం అనరాదని జరార్ ఖాన్ అనే పాకిస్తానీ మంత్రి ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ కూడా పరుష వ్యాఖ్యలు చేశారు. 

 
''చాలా బావుంది ఇస్రో.. ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? గృహ నిర్భంలోనున్న అమాయక కశ్మీరీలనా?, 'ఎండియా'లో ముస్లింలు, మైనారిటీలనా?, 'ఎండియా'లో హిందూ వ్యతిరేక గళాలనా? లేక ఐఎస్ఐనా?. హిందూత్వం చంద్రుడిపైకి సహా మిమ్మల్ని ఎక్కడికీ తీసుకుపోలేదు.''అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌తో లంకె పెడుతూ పాకిస్తాన్ మీడియాలో ఈ మూన్ మిషన్‌పై ఛలోక్తులు విసిరారు.