1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:43 IST)

కరోనావైరస్: మే 14-18 మధ్య కోవిడ్ విశ్వరూపం, శాస్త్రవేత్తల అంచనా - ప్రెస్ రివ్యూ

మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. భారత్‌లో హడలెత్తిస్తున్న కరోనా రెండో ఉద్ధృతికి సంబంధించి తమ అంచనాలను ఐఐటీ శాస్త్రవేత్తలు తాజాగా సవరించారు.

 
మే నెల 14-18 మధ్య ఈ మహమ్మారి ఉద్ధృతి పతాక స్థాయికి చేరుకోవచ్చని వారు తెలిపారు. ఆ సమయంలో దేశంలో క్రియాశీల కొవిడ్‌-19 కేసులు 38-48 లక్షల మధ్య ఉండొచ్చని చెప్పారు. మే నెల 4-8 మధ్య రోజువారీ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య అత్యధికంగా 4.4 లక్షలకు చేరుకోవచ్చని విశ్లేషించారు.

 
'ససెప్టబుల్‌, అన్‌డిటెక్టడ్‌, టెస్ట్‌డ్‌ (పాజిటివ్‌), అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌' (సూత్రా) అనే గణిత నమూనా ఆధారంగా కాన్పుర్‌, హైదరాబాద్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ అంచనాలు వేశారు. గత వారం కూడా వీరు కొన్ని విశ్లేషణలు చేశారు. మే 11-15 మధ్య ఈ మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, ఆ సమయంలో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షల మేర ఉండొచ్చని ఆ అంచనాల్లో చెప్పారు.

 
మే నెలాఖరుకు కేసులు గణనీయంగా తగ్గొచ్చని కూడా నాడు తెలిపారు. ఏప్రిల్‌ 15 నాటికి భారత్‌లో క్రియాశీల కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఈ నెల మొదట్లో వారు చేసిన అంచనాలు తప్పాయి. ఇప్పుడు కొన్ని సవరణలు చేశారు. ''ఈ దఫా అంచనాలకు సంబంధించి కనిష్ఠ, గరిష్ఠ వివరాలనూ లెక్కించాం. అందువల్ల మేం ఊహించిన శ్రేణిలోనే వాస్తవ విలువలు ఉంటాయని కొంతవరకూ ధీమాగా చెప్పగలను'' అని అధ్యయనంలో పాల్గొన్న మణిందర్‌ అగర్వాల్‌ చెప్పారు.

 
భారత్‌లో ప్రస్తుత దశకు సంబంధించిన వివిధ పరామితుల విలువల్లో నిరంతరం మార్పులు జరగడం వల్లే అంచనాలను సవరించాల్సి వస్తోందని ఆయన చెప్పారని ఈనాడు వివరించింది.