శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శనివారం, 21 మే 2022 (12:13 IST)

హైదరాబాద్‌‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు

Image
నాగరాజు ఘటన మర్చిపోకముందే హైదరాబాద్‌లో మరో యువకుడి హత్య కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్ ప్రాంతంలో జనం తిరుగుతోన్న సమయంలోనే ఒక యువకుడిని ఇరవైసార్లు పొడిచి చంపారు.

 
మార్వాడీ కులానికి చెందిన నీరజ్ కుమార్ పన్వర్, యాదవ కులానికి చెందిన సంజనలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఆర్యసమాజ్‌లో జరిగింది. వీరికి నెలల వయసున్న బాబు ఉన్నాడు. అబ్బాయిపై కోపం పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులు ఈ హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక అంచనా.

 
నీరజ్ కుమార్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. నీరజ్, సంజనలు పెళ్లి చేసుకున్నపుడు.. నీరజ్ తనకు ప్రాణ హాని ఉందని అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో హత్య జరిగింది. నీరజ్ రోడ్డు దాటుతుండగా ముందుగా గ్రానైట్ రాయితో మోదారు. తరువాత కొబ్బరి బొండాల కత్తితో పొడిచారు. అతని హత్యకు చాలాకాలం నుంచి ప్రణాళిక వేస్తూ, కొంతకాలంగా అతని రాకపోకలు గమనిస్తూ ఉన్నారు.

 
ఘటన సమాచారం అందుకున్న షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య బేగంబజార్‌లో కలకలం రేపింది. స్థానిక వ్యాపారులు అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శనివారం బేగంబజార్ బంద్‌కి పిలుపునిచ్చారు. ఘటనపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో ఇప్పటి వరకూ పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.