శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (10:11 IST)

ఎయిరిండియా అధికారుల నిర్లక్ష్యం : నైజీరియన్ బ్యాంకు ఖాతాకు నిధుల మళ్ళింపు

దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఎయిరిండియా ఒకటి. ఈ సంస్థలో పనిచేసే అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. విడి భాగాలు సరఫరా చేసే కంపెనీకి చెల్లించాల్సిన నిధులను నైజీరియాలోని ఓ బ్యాంకు ఖాతాకు మళ్లించారు. ఈ ఘటన 2017లో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నిధులను తిరిగి పొందేందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రభుత్వ రంగ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు సర్వీసులను నడుపుతోంది. ఈ సంస్థకు అమెరికాలో కూడా ఓ ప్రాంతీయ కార్యాలయం ఉంది. అలాగే, ఈ సంస్థకు కావాల్సిన విడి భాగాల(స్పేర్ పార్ట్స్)ను అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రట్ట అండ్ విట్నే అనే కంపెనీ సరఫరా చేస్తుండగా, ఈ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను అమెరికా, న్యూయార్క్‌లోని ఎయిరిండియా కార్యాలయం చెల్లిస్తూ వస్తోంది. అయితే, ఆ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధిత కంపెనీకి చెల్లించాల్సిన 3 లక్షల డాలర్ల నిధులను నైజీరియాలోని ఓ బ్యాకు ఖాతాకు బదిలీచేశారు. ఈ తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 
 
ఇదే అంశంపై ఎయిరిండియా అధికారులను సంప్రదిస్తే, ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోందన్నారు. ఇది సైబర్ నేరంగా పరిగణించి విచారణ జరుపుతున్నట్టు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి చెప్పారు. అనేక సైబర్ నేరాలు నేజీరియా కేంద్రంగా సాగుతున్నాయి. ఇపుడు ఎయిరిండియా కూడా ఓ బాధిత కంపెనీగా చేరింది. కాగా, ఎయిరిండియా శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌తో పాటు యూరోప్ తదిత దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. మరోవైపు, అనేక విమానాలకు విడిభాగాలు అందుబాటులో లేక షెడ్డుకే పరిమితం చేసింది. దీనికితోడు ఎయిరిండియా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని పీకల్లోతు కష్టాల్లో ఉంది.