శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:23 IST)

ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ముక్కుల నుంచి రక్తం... ఎందుకంటే?

ఎయిరిండియా సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ నుండి కాలికట్ బయల్దేరిన విమానంలో పీడనం తగ్గడంతో కొందరు ప్రయాణికులకు ముక్కు నుండి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో బాధపడ్డారు. 
 
185 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటుగా ఆదివారం మస్కట్ ఎయిర్‌పోర్ట్ నుండి కాలికట్ బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులోని ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మస్కట్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. 
 
ప్రయాణికులలో నలుగురికి ముక్కు నుంచి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో ఇబ్బందిపడ్డారు. వారందరికీ విమానాశ్రయంలో చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత విమానం కాలికట్ బయల్దేరింది. ప్రయాణికులలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.