శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:50 IST)

ఏప్రిల్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలు : రైల్వే శాఖ

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత యేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కేవలం ఫెస్టివల్ రైళ్లు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్ళ సర్వీసులను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ శుక్రవారం ప్రకటించింది. 
 
ప్రస్తుతం దశల వారీగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 65 శాతం మేరకు రైళ్ళ రాకపోకలు సాగుతున్నాయి. జనవరి నుంచి  మరో 250 రైళ్ళను అదనంగా నడుపుతున్నాం. మున్ముందు కూడా మరికొన్ని రైళ్లను అదనంగా నడుపుతామని రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా అదుపులోకి వచ్చింది. ఫలితంగా కొత్త కరోనా కేసుల నమోదు కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ళతో పాటు శతాబ్ది, రాజధాని రైళ్లను కూడా నడుపుతామని పేర్కొంది. అలాగే రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ఐపే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే సమయం ఆదా అవుతుందని పేర్కొంది.