1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:00 IST)

వందే భారత్ రైళ్ల తయారీ ఆర్డర్‌ భెల్ సొంతం - స్లీపర్ బోగీలతో రైళ్లు

vande bharat express
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మరిన్ని మార్గాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత రైల్వే శాఖ దృష్టిసారించింది. ఇందుకోసం మరిన్ని రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఛైర్ కార్లతో నడుసున్న వందే భారత్ రైళ్లను భవిష్యత్‌లో దూర ప్రాంతాలకు కూడా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇందుకోసం స్లీపర్ కోచ్‌లను తయారు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ రైళ్ల తయారై ఆర్డర్‌ను భెల్ సొంతం చేసుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్ల వ్యయంతో మొత్తం 80 రైళ్లకు ఆర్డర్ ఇచ్చారు. ఈ బోగీలను టిటాగఢ్ వ్యాగన్ వర్క్‌షాపుతో కలిసి భెల్ తయారు చేయనుంది. అలాగే. 35 యేళ్లపాటు వార్షిక నిర్వహణ విధులను కూడా భెల్ నిర్వహించనుంది. 
 
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్) ఈ ఒప్పందాన్ని రూ.9600 కోట్లకు దక్కించుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్ల ఖర్చుతో తయారు చేస్తారు. ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉన్న టిటాగఢ్ వ్యాగన్స్‌తో కలిసి భెల్ ఈ రైళ్లను తయారు చేయనుంది. కండిషన్స్ ఒప్పందం ప్రకారం 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు, 72 నెలల్లో అంటే ఆరేళ్లలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 35 యేళ్లపాటు వాటి నిర్వహణ భాధ్యతలను కూడా భెల్ చూడాల్సి ఉంటుంది. 
 
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్లు మాత్రమే ఉంటాయి. దీంతో స్లీపర్ క్లాస్ రైళ్లు నడపాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లను ఆహ్వానించగా, భెల్ దానిని దక్కించుకుంది. ప్రస్తుతం పగటిపూటే నడుస్తున్న వందే భారత్ రైళ్లు.. స్లీపర్ బోగీలు అందుబాటులోకి వస్తే మాత్రం రాత్రి సమయాల్లో కూడా నడుపనున్నారు.