1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (17:22 IST)

పరుగులు పెడుతున్న పసిడి ధరలు - కిలో వెండి రూ.48,800

కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం పసిడి ధర సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. అలాగే, వెండి ధర కూడా భారీగానే పలికింది. 
 
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ.46,290 పలికింది. 
 
వెండిదీ అదే బాట. కేజీ సిల్వర్‌ రూ.48,800కి ఎగబాకింది. ముంబై బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) రూ.48,130 పలుకగా.. కేజీ వెండి ధర రూ.48,825కి చేరుకుంది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది.
 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,767 డాలర్లు, వెండి 18 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండటంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని ఊహాగానాల నేపథ్యంలో లోహాలకు డిమాండ్‌ పెరిగింది. సంక్షోభ కాలంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఈక్విటీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు ఎగబాకుతున్నాయి.