గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

సరికొత్త రికార్డును సృష్టించిన జీఎస్టీ వసూళ్లు

gstimage
ఈ యేడాది జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధితో జీఎస్టీ వసూళ్లు రూ.1,61,497 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి నెల వారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల పైస్థాయిలో నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
గత నెల మొత్తం ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ రూ.31,013 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.38,202 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లుగా ఉంది. పరిహార సెస్సు రూపంలో మరో రూ.11,900 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా.. ఏప్రిల్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లకు పెరిగాయి.
 
ఆ కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) వసూళ్ల సగటు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, 2022-23లో ఇదేకాలానికి ఆదాయ సగటు రూ.1.51 లక్షల కోట్లు 2021-22లో రూ.1.10 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, గత నెలకు ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 16 శాతం వృద్ధితో రూ.3.477.42 కోట్లకు చేరుకోగా.. తెలంగాణ నుంచి వసూళ్లు 20 శాతం పెరుగుదలతో రూ.4,681.39 కోట్లుగా నమోదయ్యాయి.