డెస్క్టాప్ పై వాట్స్యాప్ సేవలు ప్రారంభం...!
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్యాప్ ఇకపై డెస్క్టాప్, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్యాప్ మెసేజ్లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు.
ఇటీవల మొబైల్ వాడకం దారులు ఎక్కువ అయినప్పటికీ. ఎక్కువ మంది కంప్యూటర్పైనే సమయం గడుపుతుండడంతో వారు మొబైల్పై కూడా ఒక కన్నేసి ఉంచాల్సి వస్తుంది. అంతేకాకుండా ఫోన్ల ద్వారా మెసేజ్ టైపింగ్ చేయడం కొందరికి కుదరదు. అటువంటివారు డెస్క్ టాప్ ద్వారా ఒక వైపు కంప్యూటర్ వర్క్ చేసుకుంటూనే మరో వైపు అతి సులభపద్దతిలో మెసేజ్లను టైప్ చేసి వాట్స్యాప్ ద్వారా పంపుకోవచ్చు. అయితే మొబైల్లోనూ తాజా వాట్స్యాప్ వెర్షన్ను అప్డేట్ చేసుకోవడంతో పాటు మొబైల్ను నెట్తో కనెక్ట్ చేసి ఉంచడం తప్పనిసరి.
కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్స్యాప్కు 60 కోట్ల మందికిపైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. భారత్లో వాట్స్యాప్ యూజర్ల సంఖ్య 7 కోట్లు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే.. యూజర్లు క్రోమ్ బ్రౌజర్లో ‘వెబ్.వాట్స్యాప్.కామ్’ వెబ్సైట్ ఓపెన్ చేసి, అందులోని క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేయాలి. దీంతో మొబైల్ ఫోన్లోని వాట్స్యాప్ అకౌంట్ బ్రౌజర్లో ప్రత్యక్షమవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.