గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (22:47 IST)

వారానికి 60 గంటలు కష్టపడితేనే కోలుకుంటాం : 'ఇన్ఫోసిస్' మూర్తి

కరోనా వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదనీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే వారానికి కనీసం 60 గంటల పాటు కష్టపడాల్సివుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు కష్టపడతామని దేశ ప్రజలంతా ప్రతిన పూనాలని ఆయన పిలుపునిచ్చారు.
 
కరోనా వైరస్ ప్రభావం, లాక్‌కౌడ్ అమలు దేశంలోని అన్ని రంగాల్లోపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. కరోనా కారణంగా కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు వచ్చే రెండు మూడేళ్లపాటు వారానికి 60 గంటల పాటు పని చేయాల్సివుంటుందన్నారు. 
 
అలాగే, వ్యాపారాని ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు 1991లో ఏర్పాటు చేసినట్టుగా నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వానికి మూర్తి సూచించారు. అంతేకాకుండా.. రాబోయే సంత్సరన్నర పాటూ కరోనాతో సహవాసం చేసేందుకు ప్రజలు అలవాటు పడాలని కూడా తెలిపారు. 'ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుందాం, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాదు' అంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, దేశంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరికొంతకాలం ఇలానే పొడగిస్తే మాత్రం కోవిడ్ 19 మృతుల కంటే ఆకలితో చనిపోయేవారే సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకుంటూనే, పలు సంస్థలను తిరిగి తెరవాలని ఆయన సూచించారు.
 
భారత్‌లో యేడాదికి దాదాపు 9 మిలియన్ల మంది పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో వాతావరణ కాలుష్యం కారణంగా మృతి చెందేవారు 25 శాతం మంది అని గుర్తుచేశారు. 'దేశంలో ఏడాదికి 90 లక్షల మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో గత రెండు నెలల్లో సుమారు 1,000 మంది మాత్రమే  చనిపోయారు. ఇదేం పెద్దగా భయపడాల్సిన విషయమేం కాదు' అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. 
 
దేశంలో 190 మిలియన్ల మంది భారతీయులు అసంఘటిత, స్వయం ఉపాధి రంగాల్లో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఇంత మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం చాలా మంది జీవనోపాధిని కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.