గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:19 IST)

సౌదీలో కరోనాతో 11మంది భారతీయుల మృతి.. టర్కీ ఆ లిస్టులో చేరిపోయింది..

corona hospital
సౌదీ అరేబియాలో కరోనా బారిన పడి 11మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం ధ్రువీకరించింది. ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్‌తో మరణించగా.. వీరిలో మదీనాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్‌, డామ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 
 
ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంగా భారత్‌కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట వేయడం కుదరడం లేదు. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,04,676కు చేరింది. వీరిలో 1,90,549 మంది మృత్యువాతపడగా.. 7,38,032మంది కోలుకున్నారు. 
 
ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 8,89,568పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 81,792మంది కోలుకోగా.. 50,177 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్‌ దేశాలు ఉండగా.. తాజాగా టర్కీ ఆ లిస్ట్ లో చేరింది.
 
అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇరాన్‌, చైనా, రష్యా దేశాలు కొనసాగుతున్నాయి. ఇక వైరస్‌ పుట్టిన చైనాలో ప్రస్తుతం 82,810కేసులు ఉన్నాయి. ఇక భారతదేశంలో 21,700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.