1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:01 IST)

సోలాల్ రూఫ్ టాప్ విద్యుత్... కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ : నిర్మలమ్మ వెల్లడి

Solar plant
కోటి గృహాలకు 300 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆమె గురువారం లోక్‌సభలో మధ్యంతర వార్షిక బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు సౌర విద్యుత్ వెలుగులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు. ఇందులోభాగంగా, కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 
 
రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉత్పత్తి అయినదాంట్లో మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించవచ్చని తెలిపారు. ఇందులోభాగంగా, సోలార్ విద్యుత్ గ్రిడ్ ఏర్పాటు కోసం ఈ బడ్జెట్‌లో రూ.8500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 
 
కాగా, ఇతర సంక్షేమ, ఇతర పథకాలకు కేటాయించిన కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే, గ్రామీణ ఉపాధి హామ పథకానికి రూ.86 వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాకాలకు రూ.6200 కోట్లు, సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీలో రూ.6903 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పథకం కోసం రూ.600 కోట్లు చొప్పున విత్తమంత్రి కేటాయించారు.