శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (19:08 IST)

రైతుల పంట.. రైతుల ఇష్టం.. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు : విత్తమంత్రి

ఆరుకాలం పండించిన రైతుల పంట  రైతుల ఇష్టమని, ఆ పంటకు ఎక్కడ గిట్టుబాటు ధర అధికంగా ఉంటే అక్కడ అమ్ముకోవచ్చని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. ఇందుకోసం అంతర్‌రాష్ట్ర వ్యవసాయ వాణజ్యాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. 
 
కరోనా సంక్షోభం నేపథ్యంలో రూ.20 లక్షల కోట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రకటించారు. ఇందులో 15 అంశాలు ఉండగా, ఒక్కో రోజు ఒక్కో అంశం గురించి విత్తమంత్రి నిర్మలమ్మ వివరిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె శుక్రవారం వ్యవసాయం రంగం గురించి వివరించారు. ఇందులో రైతులకు ఊరట కలిగించే అంశాలను వెల్లడించారు. 
 
వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అంతర్రాష్ట్ర వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని, రైతులు ఏ రాష్ట్రంలోనైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే తమ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చని తెలిపారు.
 
అలాగే, తమకు అనుకూల ధరకు కొనుగోళ్లు కూడా జరపవచ్చని ఈ మేరకు జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని చెప్పారు. లైసెన్సులు పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం ఇక మీదట ఉండదని, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై పరిమితులు తొలగిస్తున్నామని వెల్లడించారు. 
 
అలాగే, ప్ర‌ధానమంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న ప‌థ‌కానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. స‌ముద్ర‌, ఆక్వా, చేప‌ల చెరువుల స‌మ‌గ్ర‌, సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేస్తామన్నారు. మెరైన్‌, ఇన్‌ల్యాండ్ ఫిష‌రీస్‌, ఆక్వాక‌ల్చ‌ర్ కోసం రూ.11 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నట్టు వెల్లడించారు. ఫిషింగ్ హార్బ‌ర్స్‌, కోల్డ్ చెయిన్స్‌, మార్కెట్ల కోసం మ‌రో రూ.9 వేల కోట్ల నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. 
 
మ‌త్స సంప‌ద యోజ‌న ప‌థ‌కం ద్వారా రానున్న అయిదేళ్ల‌లో దాదాపు 70 ల‌క్ష‌ల ట‌న్నుల చేప‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం వ‌ల్ల సుమారు 55 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు దొరికే ఛాన్సు ఉన్న‌ది. అంతేకాదు, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎగుమ‌తుల విలువ సుమారు రూ.ల‌క్ష కోట్లు దాటుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంచనా వేస్తున్నట్టు తెలిపారు.