వాణిజ్య లక్ష్యాలు చేరుకోవడం ఈజీ కాదు : బరాక్ ఒబామా
మూడు రోజుల పర్యటనకు న్యూఢిల్లీకి వచ్చివున్న అమెరికా అధినేత బరాక్ ఒబామా తన మనస్సులోని మాటను బహిర్గతం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య అనుకున్న వాణిజ్య లక్ష్యాలను చేరుకోవడం అంత సులభమైన పని కాదని ఆయన చెప్పుకొచ్చారు.
సోమవారం రాత్రి న్యూఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. భారత్తో వ్యాపారానికి ఇంకా ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు మరింతగా కృషి చేయాలని తన మనసులో మాటను ఒబామా తెలిపారు. అమెరికా దిగుమతుల్లో ఇండియా వాటా కేవలం 2 శాతమే. ఇక ఎగుమతుల్లో భారత్కు వస్తున్నది ఒక్క శాతం మాత్రమే. 100 కోట్లకు పైగా జనాభా ఉన్నా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇరు దేశాలూ ఎంతో చేయాలి.
ఇండియాతో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.3 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని నమోదు చేయగా, చైనాతో 560 బిలియన్ డాలర్ల (సుమారు 48 లక్షల కోట్లు) వాణిజ్యాన్ని అమెరికా నమోదు చేసిందని ఆయన గుర్తు చేశారు. భారత్తో వాణిజ్య బంధాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం తరపున 4 బిలియన్ డాలర్లు (సుమారు 25 వేల కోట్లు) పెట్టుబడులుగా, రుణాలుగా ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.