1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (07:54 IST)

జీఎస్టీ పరిధిలో చేర్చితే రూ.2 లక్షల కోట్ల ఆదాయం నష్టం!

దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వీటి ధరలు సెంచరీ కొట్టాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలంటే ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడమే ఉత్తమమని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కానీ, కేంద్రం ఆ పని చేయడం లేదు. ఒకవేళ కేంద్రం చేస్తానన్నా రాష్ట్రాలు అందుకు సమ్మతించడం లేదు. దీనికి కారణం.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఏకంగా రూ.2 లక్షల కోట్ల మేరకు ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతాయి. 
 
ఇదే అంశంపై బీజేపీ నేత, ఎంపీ సుశీల్ మోడీ స్పందిస్తూ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కనీసం 8 నుంచి 10 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదన్నారు. 
 
ఒకవేళ జీఎస్‌టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందని.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదని ఆయన తెలిపారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్‌ మోదీ ఈ వివరాలు వెల్లడించారు. 
 
రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్తత్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నాయని, జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు సుశీల్‌ మోదీ తెలిపారు.