ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థి యేడాది జీతం రూ.కోటిన్నర!!
ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థికి ఓ కంపెనీ ఒక యేడాదికి కోటిన్న రూపాయలను జీతంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఐఐటీ క్యాంపస్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఈ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 27 కంపెనీలు పాలుపంచుకోగా, 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్పూర్ ఛైర్మన్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు.
ఈ యేడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మన దేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించినట్టు చెప్పారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు.