గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (14:21 IST)

కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఎపుడు రక్తదానం చేయొచ్చు!

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లోభాగంగా, ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. మరికొంతమంది ఈ వ్యాక్సిన్ వేయించుకునేందుకు తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. 
 
ఈ క్రమంలో కరోనా టీకా వేయించుకున్న వారు రక్తదానం చేసే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీకా వేయించుకున్న వారు ఎపుడు రక్తదానం చేయాలన్న అంశంపై నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌బీటీసీ) కీలక సూచనలు చేసింది. 
 
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత 28 రోజుల వరకు రక్తదానం చేయొద్దంటూ ఎన్‌బీటీసీ సూచనలు చేసింది. గతనెల 17న జరిగిన ఎన్‌బీటీసీ పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ సునీల్‌ గుప్తా పేర్కొన్నారు. దీనికి సంబంధించి నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ కౌన్సిల్‌ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసిందని వెల్లడించారు.
 
కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ ఏదైనప్పటికీ.. రెండో డోసు తర్వాత 28 రోజుల వరకు రక్తదానానికి ఆగాల్సిందేనని ఎన్‌బీటీసీ వెల్లడించింది. అంటే తొలి డోసు తీసుకున్న అనంతరం 56 రోజులపాటు (రెండు నెలలపాటు) రక్తదానం చేయొద్దని సూచించింది.
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాతే శరీరంలో కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. అలాగే టీకా తీసుకున్న అనంతరం మద్యపానానికి దూరంగా ఉండాలా అనే విషయంలో ఏర్పడిన సందేహాన్ని సైతం ఆరోగ్యశాఖ ఇటీవల నివృత్తి చేసింది. మద్యపానం వల్ల టీకా ప్రభావశీలత తగ్గిందనడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదని స్పష్టంచేసింది.