1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (14:30 IST)

ముంబై కలకలం.. నర్సులు, వైద్యులకు కరోనా... వోకార్డ్ ఆస్పత్రి మూసివేత

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక వోకార్డ్ ఆస్పత్రిలో పని చేసే నర్సులు, వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేసి, అందులో పనిచేసే సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. 
 
దేశంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ కేసులన్నింటికి మూలం ఢిల్లీ జరిగిన మర్కజ్ మీట్‌కు వెళ్లివచ్చిన ముస్లింల వల్లేనని తేలింది. దీంతో మహారాష్ట్రలోని అనేక ఏరియాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. 
 
ఈ పరిస్థితుల్లో వోకార్డ్ ఆస్పత్రిలో పనిచేసే 26 మంది నర్సులు, ముగ్గురు వైద్యులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ ఆసుపత్రిలో ఇంతగా కరోనా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై విచారణకు అధికారులు ఆదేశించారు.
 
ఆ ఆసుపత్రిలోకి ప్రవేశం, అలాగే ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడాన్ని నిషేధించారు. ఇప్పటికే ఉన్న రోగులు కూడా బయటకు వెళ్లడాన్ని నిషేధించారు. ఆసుపత్రిలోని రోగులందరికీ రెండు సార్లు కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
 
ఆ ఆసుపత్రిలో 270 మంది రోగులు, నర్సులను పరీక్షిస్తున్నారు. ఓపీతో పాటు ఎమర్జెన్సీ సేవలనూ నిలిపి వేశారు. ఆసుపత్రిలోని క్యాంటీన్‌ ద్వారానే అందులోని పేషెంట్లు, నర్సులకు ఆహారం అందుతుంది. కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన 745 కేసుల్లో 458 కేసులు ముంబైలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు.