శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

ఐదు నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్.. టెస్టుల్లో లోపమా?

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు 5 నెలల్లో 31 సార్లు కరోనా వైరస్ సోకింది. ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ విషయం తేలింది. దీంతో ఆమెకు ఏం చేయాలో దిక్కుతోచక దిగాలుగా కూర్చొంది. 
 
అటు కన్నవారితో పాటు.. ఇటు కట్టున్నవాడు చనిపోయి అనాథగా మారిన ఈ మహిళకు ఆగస్టు 24న కరోనా వైరస్ సోకింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 5 నెలల్లో టెస్ట్ చేసిన ప్రతిసారీ పాజిటివ్ వస్తూనే ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 14 సార్లు.. యాంటీజెన్ టెస్టుల్లో 17 సార్లు.. మొత్తంగా 31 సార్లు కరోనా పాజిటివ్ అన్న రిపోర్టే వచ్చింది.
 
ఇప్పటికే మానసికంగా కుంగిపోయిన ఆమెకు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే మరో జబ్బు కూడా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్‌లో పెట్టినట్టు అప్నా ఘర్ వ్యవస్థాపకుడు బ్రిజ్ మోహన్ భరద్వాజ్ చెప్పారు. పాజిటివ్ రాగానే ఆమెను కరోనా చికిత్స కోసం భరత్పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు.
 
మొత్తం 15 సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే.. మధ్యలో ఒక్కసారి అక్టోబర్ 15న మాత్రమే ఆమెకు నెగెటివ్ వచ్చిందని భరత్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కప్తాన్ సింగ్ చెప్పారు. ఆమెకు అసలు లక్షణాలే లేవని, ఆమె పొట్ట, పేగుల్లో చనిపోయిన వైరస్ కణాలు ఉండి ఉంటాయని, దాని వల్లే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ వస్తుండొచ్చు అని చెప్పారు.