ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 23 మార్చి 2021 (14:52 IST)

కరోనావైరస్ విజృంభణ, ఏపీలో ముందస్తు జాగ్రత్తలు

కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కట్టడి చేయడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి. 
 
సచివాలయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఛాంబర్లో అత్యవసరంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు అనిల్ కుమార్ సింఘాల్, ముద్దాడ రవి చంద్ర, కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా సమావేశంలో పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతం తీసుకోవలసిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి చర్చించారు.కరోనా ప్రమాదం గురుంచి ప్రజలకు మరింత విశ్రుత స్థాయిలో ప్రచారం నిర్వహించడం కోసం అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. 
 
వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయముతో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డ్, గ్రామ సచివాలయం పరిధిలో 60 ఏళ్ళు, 45 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించనున్నట్లు తెలిపారు.
 
అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లా కలెక్టర్లు పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలి. కరోనా కట్టడిలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి. 
జిల్లా స్థాయిలో, మండల  స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు, భాగస్వామ్యం చేస్తూప్రజలకు అవగాహన కోసం అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల్లో, సోషల్ మీడియా ద్వారా, వివిధ రకాల పోటీలు, మత సంస్థల్లో కరోనా నియంత్రణపై పెద్ద ఎత్తున తనిఖీ లు నిర్వహించాలి. గ్రామ, పట్టణ, మండల స్థాయిలో క్యాండిల్ ర్యాలీ లు నిర్వహించి కరోనా నివారణకు ప్రజలను చైతన్య పరచాలి. 
కరోనా వ్యాక్సిన్ రోజుకి కనీసం 3లక్షలు పై బడి వేయాలని లక్ష్యం గా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయలతో పాటు, 1930 ప్రభుత్వ హాస్పిటల్స్, 634 ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్లో యధావిధిగా టీకా ప్రక్రియ కొనసాగుతుంది. కరోనా టీకా తీసుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 104 అంబులెన్సు అందుబాటులో ఉంచామన్నారు. 
అత్యవసర వైద్యం అందించడానికి కూడా 108 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 
 
అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేసే ముందు గ్రామాల్లో, పట్టణాల్లో, మైక్ ద్వారా ప్రచారం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ, మాస్కలు లేకుండా ఎవరు బైట తిరగకూడదని తెలిపారు.