ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (10:03 IST)

దేశంలో కరోనా దూకుడు .. కొత్తగా 37 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,379 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, సోమవారం ఒక్కరోజే ఈ వైరస్ సోకిన వారిలో 124 మంది మృత్యువాతపడ్డారు. అదేవిధంగా కరోనా కేసుల రోజువారీ పెరుగదలలో 3.24 శాతం వృద్ధి కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 11007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. అలాగే, యాక్టివ్ కేసులు 171830గా ఉంటే, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,43,06,414గా ఉంది. ఒక్క ఢిల్లీలోనే 4,82,017 యాక్టి్వ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో ఇప్పటివరకు 1,46,70,18,464 మందికి కరోనా వ్యాక్సిన్ టీకాలు వేశారు.
 
హస్తినలో కొత్త వేరియంట్  
దేశ రాజధాని హస్తినను కొత్త కరోనా వేరియంట్ వణికిస్తుంది. గత నెల 30, 31 తేదీల్లో నమోదైన కరోనా కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా, సోమవారం విడుదల చేసిన మీడియా బులిటెన్ మేరకు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ఇది మరింతగా పెరిగితే మాత్రం రెడ్ అలెర్ట్‌ను ప్రకటించే అవకాశం ఉందని మంత్రి జైన్ వెల్లడించారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అలాగే, విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు, జిమ్‌లు స్పాలు మూసివేశారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో రెస్టారెంట్లు, మెట్రోలు కొనసాగుతున్నాయి. ఇక కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో నడుస్తున్నాయి. 
 
సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ 
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ మరోమారు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈయన గతంలో ఒకసారి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.
 
ఇపుడు మరోమారు ఈ వైరస్ సోకింది. తనలో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే కోలుకుని తిరిగి బయటకు వస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేనిద అందులో పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి కూడా శరవేగంగా సాగుతోంది. ఇక్కడ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని వైద్య నిపుణులతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.
 
ఒమిక్రాన్ చికిత్సకు ఆరోగ్య బీమా వర్తింపు 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. అలాగే, భారత్‌లోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్ఖ (ఐఆర్‌డీఏఐ) శుభవార్త చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని వెల్లడించింది. 
 
అలాగే, సాధారణ ఆరోగ్య బీమా సంస్థలు జారీచేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.
 
అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అనేక మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారికి ఆస్పత్రుల్లో చేసిన ఖర్చులు కూడా కరోనా ఆరోగ్య బీమా పాలసీలో కవరేజీ అవుతాయని చెప్పారు.