శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:03 IST)

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పైపైకి... ఆక్సిజన్ నిల్వలు కిందకు

దేశంలో కరోనా వైరస్ పాజిటివి కేసులో నానాటికీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్త‌గా 3,86,452 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,97,540 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 3,498 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,08,330కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,53,84,418 మంది కోలుకున్నారు. 31,70,228   మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  28,63,92,086 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,20,107 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. మరోవైపు, దేశంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ నిల్వలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఆక్సిజన్ కోసం కరోనా రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. 
 
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,261 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒకే రోజు 77,091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో 77,727 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. 
 
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,441 కేసులు నమోదుకాగా, ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్‌నగర్‌లో 243, జగిత్యాలలో 230 కేసులు రికార్డయ్యాయి.