1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (20:15 IST)

మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోయిందా? కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు

మహారాష్ట్రలో పరిస్థితి చేయిదాటిపోయిందా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. మొదటి, రెండు దశలు దాటిపోయి.. మూడో దశకు చేరుకుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ కారణంగా ఆ రాష్ట్రంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం కూడా కొత్తగా ఏకంగా 283 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
ఇది ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం నమోదైన కొత్త కేసులతో కలుపుకుని మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 4483 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మరణాల సంఖ్య 223గా ఉంది. కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర దేశంలోనే ముందుంది. అయితే, మొత్తం కేసుల్లో రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 2,724 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
తాజాగా, నమోదైన 283 కేసుల్లో 187 ముంబైలో నమోదైనవే కావడం గమనార్హం. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో పూణె మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని ఆదివారం కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.