1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (15:53 IST)

అమెరికాలో కరోనా తొలి టీకాను నల్లజాతి నర్సుకు ఎందుకు వేశారు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు టీకాలను అభివృద్ధి చేశాయి. వీటిలో కొన్ని వ్యాక్సిన్ల పంపిణీకి ఆయా దేశాలు అనుమతులు మంజూరు చేశాయి. ఇందులోభాగంగా, బ్రిటన్‌లో ఇప్పటికే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా, అమెరికాలో సోమవారం నుంచి ప్రారంభమైంది. అయితే, అమెరికాలో తొలి టీకాను ఓ నల్లజాతి నర్సు సాండ్రా లిండ్సేకు వేశారు. 
 
న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఆమె, తొలుత వ్యాక్సిన్ తీసుకున్న మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె చిత్రాలు దాదాపు అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ఇక మొట్టమొదటి వ్యాక్సిన్ ఆమెకే ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారో అధికారులు వెల్లడించారు.
 
నర్సుగా పని చేస్తున్న ఈమె క్రిటికల్ కేర్ విభాగంలో నిరంతరాయంగా సేవలందిస్తూ వస్తోంది. క్రిటికల్ కేర్ విభాగమంటే, రోగి పరిస్థితి విషమించినప్పుడు చేసే చికిత్స విభాగం. ఈ చికిత్సలో ప్రతి క్షణమూ అత్యంత కీలకం. 
 
కరోనా సోకి, అత్యంత విషమంగా పరిస్థితులు మారిన బాధితులకూ సాండ్రా తన చికిత్సలతో ఉపశమనాన్ని కలిగించారు. ఆమె చికిత్స తర్వాత ఎంతో మంది వెంటిలేటర్ స్థాయి నుంచి కూడా కోలుకుని ఇంటికి చేరారు. తన సేవలతో సాండ్రా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అందువల్లే ఆమె పేరును ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. 
 
ఇక తన సోదరికి ఇంతటి ఘనత దక్కడంపై లిండ్సే సోదరుడు గారీఫీల్డ్ లిండ్సే స్పందిస్తూ, తను ఆరు సంవత్సరాల వయసులోనే జమైకా నుంచి అమెరికాకు వచ్చిందని, సేవా భావం ఆమె కలని, దాన్ని నిజం చేసుకునేందుకు అనుక్షణం ప్రయత్నించిందని, అందుకు దక్కిన ప్రతిఫలమే ఈ గుర్తింపని అన్నారు.