మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (12:09 IST)

కరోనాకు ఉచిత టెస్టులు చేయిలేం : చేతులెత్తేసిన మేఘాలయ

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఇప్పటివరకు ఉచితంగానే నిర్ధారణ పరీక్షలతో పాటు.. ఉచిత చికిత్సను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ వచ్చాయి. అయితే, కరోనా పరీక్షల టెస్టింగ్ కిట్ల నిమిత్తం కేంద్రం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకుంది. 
 
ఈ మేరకు ఐసీఎంఆర్ ఓ ప్రకటన చేయగా, ఆ భారం భరించలేనిదని రాష్ట్రాలన్నీ భావిస్తున్నాయి. ఇప్పటికే మేఘాలయా ప్రభుత్వం, ఈ నెల 16 నుంచి ప్రజలకు ఉచిత కరోనా టెస్టులను చేయించలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సాంగ్ స్వయంగా వెల్లడించారు. 
 
వచ్చేవారం నుంచి కరోనా పరీక్షలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి వుంటుందని ఆర్టీ-పీసీఆర్, సీబీ నాట్, ట్రూనాట్, రాపిడ్ యాంటీజెన్... ఇలా ఏ టెస్ట్ అయినా, రుసుము వసూలు చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా, రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరమని, వారు రూ.500 చెల్లించాల్సి వుంటుందని, ట్రూనాట్ తదితర ఇతర పరీక్షలకు గరిష్ఠంగా రూ.3,200 వసూలు చేస్తామని అన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ బారినపడిన రోగులకు అందిస్తున్న ఉచిత భోజనాల సౌకర్యాన్నీ తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపిన ఆయన, మరిన్ని క్వారంటైన్ కేంద్రాల కోసం హోటళ్లు, గెస్ట్ హౌస్‌లను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. అయితే, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని వారు, పేదలకు మాత్రం ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.