1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (09:00 IST)

మహారాష్ట్ర పోలీసులను వణికిస్తున్న కరోనా - కొత్తగా 237 మందికి పాజిటివ్

మహారాష్ట్ర పోలీస్ శాఖను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఇప్పటికే మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఈ వైరస్ బారినపడుతున్నారు. గత 72 గంటల్లో ఏకంగా 237 మంది పోలీసులకు ఈ వైరస్ సోకింది. ఇది ఆ రాష్ట్ర పోలీసులను, వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 
 
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు 1,040 మంది పోలీసులు కరోనా బాధితులుగా మారారు. అలాగే, ఇప్పటివరకు 64 మంది పోలీసులు కరోనాతో మృతి చెందారు. పోలీసులు వరుసపెట్టి కరోనా బారినపడుతుండటంతో విధులకు వెళ్లేందుకు పోలీసులు వణుకుతున్నారు. 
 
కాగా, దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 22,771 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 442 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,48,315కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,655కి పెరిగింది. 2,35,433 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,94,227 మంది కోలుకున్నారు.
 
కాగా, శనివారంవరకు దేశంలో మొత్తం 95,40,132  శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 2,42,383 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.